ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఇస్రోజీవాడి రైతు వేదికలో రైతు గుర్తింపు కార్డుల నమోదు కార్యక్రమం
అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో రైతులు హాజరు కావాలి
– ఏఈఓ దేవేంద్ర
కామారెడ్డి, టౌన్ సెప్టెంబర్ 11 (ప్రజా జ్యోతి)
రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) దేవేంద్ర రైతులకు సూచించారు. అడ్లూరు క్లస్టర్ పరిధిలోని రైతుల కోసం ఫార్మర్ రిజిస్ట్రీ, రైతు గుర్తింపు కార్డుల నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఇస్రోజీవాడి రైతు వేదికలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఈఓ దేవేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వివరాలను సమగ్రంగా నమోదు చేసి వారికి అవసరమైన వ్యవసాయ సేవలు, పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందించేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతోందన్నారు. అడ్లూరు క్లస్టర్ పరిధిలోని ఇంకా నమోదు చేసుకోని రైతులందరూ తప్పనిసరిగా తమ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నంబర్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రైతు వేదికకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
అయితే ఇప్పటికే గతంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు ప్రస్తుతం మళ్లీ నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఏఈఓ దేవేంద్ర స్పష్టం చేశారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
రైతులకు భవిష్యత్తులో ఎరువుల బుకింగ్, వివిధ వ్యవసాయ పథకాల అమలు, ప్రభుత్వ సేవలు సులభంగా అందించేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి రైతు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా అందే సేవలు, పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఇస్రోజీవాడి రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్లూరు క్లస్టర్ పరిధిలోని గ్రామాలు రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
