హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా అంగన్వాడీ సిబ్బందిని ముందస్తు అరెస్ట్
— తెల్లవారుజామున ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు
— పోలీసుల తీరుపై అంగన్వాడి వర్కర్ల ఆగ్రహం
— హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా ప్రయత్నం
— ముందస్తు అరెస్ట్
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 09 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి మండలం పరిధిలోని పలు మండల కేంద్రాలలో సహా గ్రామాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్లో అంగన్వాడి కార్యకర్తలు నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని అంగన్వాడి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, అంగన్వాడి సిబ్బంది తమ సమస్యల పరిష్కారం, పెండింగ్లో ఉన్న పలు డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో పోలీసులు ముందస్తుగా అడ్డుకొని అరెస్టు చేశారు.
తెల్లవారుజామునే ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకుని అంగన్వాడి కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంపై సంబంధిత కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోరి గ్రామీణ ప్రాంతాల్లో కీలక సేవలు అందిస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు అంగన్వాడి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ధర్నా నేపథ్యంలో రామారెడ్డి పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
