100 గ్రాముల గంజాయి స్వాధీనం..
ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి
తూప్రాన్ (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 02:
తూప్రాన్ పట్టణ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా NH-44 నర్సాపూర్ బ్రిడ్జి సమీపంలో ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో సుమారు 100 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
గంజాయితో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసామని ఎస్ఐ తెలిపారు .
పోలీసుల వివరాల ప్రకారం.. అలావుద్దీన్, లవకుష్ అనే ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీరు తూప్రాన్ మండలంలోని శభాష్పల్లి ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ నుంచి కంపెనీకి తిరిగి వస్తున్న సమయంలో తమ వెంట గంజాయిని తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అనుమానంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు వారి వద్ద ఉన్న సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
గంజాయి గుట్టు విప్పే పనిలో పోలీసులు,గంజాయిని అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, తూప్రాన్లో ఎవరికి సరఫరా చేయడానికి తీసుకొచ్చారు, అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశంపైనా విచారణ కొనసాగుతోంది.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై తూప్రాన్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
