• రూ. 2500 సాయంపై ప్రశ్నిస్తే.. అప్పుల పురాణం విప్పిన మంత్రి
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన నర్సాపూర్లో పొలిటికల్ హీట్ పెంచింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ వేదికగా మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మధ్య మాటల యుద్ధం జరగడంతో సభ రసాభాసగా మారింది. మహిళలకు ఇస్తామన్న రూ. 2500 సాయం ఏమైందని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. “కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం వల్లే ఈ పరిస్థితి” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రి చేసిన విమర్శలతో ఒక్కసారిగా సెగ రాజుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు ‘జై కాంగ్రెస్.. జై బీఆర్ఎస్’ అంటూ పోటీ నినాదాలు చేయడంతో ఫంక్షన్ హాల్ దద్దరిల్లింది. కలెక్టర్ ప్రతిమా సింగ్ జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాయం కోసం వచ్చిన ఆడబిడ్డల సాక్షిగా ‘అధికార, ప్రతిపక్ష నేతలు’ పరస్పర దూషణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
