కోడంగల్ జోనల్ కోకో పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
అండర్-17 విభాగంలో ద్వితీయ స్థానం.. పలువురు జిల్లా స్థాయికి ఎంపిక
కోడంగల్, సెప్టెంబర్ 12 (ప్రజాజ్యోతి):
మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాల, దౌల్తాబాద్కు చెందిన విద్యార్థులు 70వ ఎస్జీఎఫ్ (SGF) కోకో టోర్నమెంట్ కం సెలక్షన్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. కొడంగల్ జోనల్లో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అండర్-17 కోకో విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడారంగంలో కూడా విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుందని తెలిపారు.
అలాగే పోటీల్లో ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో హర్షవర్ధన్, వేణు, హరి, అఖిలేష్ ఎంపిక కాగా, అండర్-14 విభాగంలో శ్రీకాంత్, రవి, మనోజ్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, కావ్య, లక్ష్మణ్, నరేష్, అనిల్, విట్టల్, సంగప్ప, రాములు, రాధా, అఖిల్, రవి, చక్రవర్తి, నరేందర్, సరోజ, లక్ష్మి, వెంకట్, శరత్, సుమలత, స్వాతి, సంతోష్, కిరణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
