11 రోజులు గడిచినా ఒక్క బస్తా కదలలేదు.. అధికారులపై ఏనుగల్ రైతుల ఆగ్రహం..!!
పర్వతగిరి, ఏప్రిల్ 15 (ప్రజాజ్యోతి)
పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో సొసైటీ వద్ద ప్రారంభించిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్రం ప్రారంభించి 11 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా బయటకు తరలించకపోవడం రైతుల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, రైతులు తమ పంట నిల్వపై ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్పందించి ఈరోజు నుంచే లారీలను పిలిపించి, మొక్కజొన్నలను లోడ్ చేసి సమీప గోదాములకు తరలించాలని, ముఖ్యంగా ఉమ్మడి ఏనుగల్ గ్రామానికి గోదాముల అలాట్మెంట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే, రేపు ఏనుగల్ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతులు హెచ్చరించారు.
