హైదరాబాద్‌లో 137 ప్లాట్లను వేలం వేయనున్న ‘రాజీవ్ స్వగృహ’

V. Sai Krishna Reddy
1 Min Read

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ (105 ప్లాట్లు), కుర్మల్‌గూడ (20 ప్లాట్లు), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో (12 ప్లాట్లు) గల మొత్తం 137 ప్లాట్లను వేలం వేయనున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వేలం ప్రక్రియ ఉంటుందని ఆయన వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌ ధరల కంటే తక్కువగా, చదరపు గజానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య ధరలను నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ యంత్రాంగమే ఈ ప్లాట్లను అభివృద్ధి చేయడం వల్ల కొనుగోలుకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన అన్నారు. ఈ వేలం ప్రక్రియ మరియు ప్లాట్ల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను (https://www.swagruha.telangana.gov.in/ais/) సందర్శించవచ్చని ఆయన తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *