ఎవరైనా లాఠీ ఉపయోగించాల్సి వస్తుంది: సింగర్ మంగ్లీ పార్టీ అనంతరం పోలీసుల హెచ్చరిక

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో పోలీసులు విదేశీ మద్యం గుర్తించిన విషయం విదితమే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన విందుపై పోలీసులు దాడి చేసి, విదేశీ మద్యం సీసాలతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మంగ్లీతో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో, మత్తు పదార్థాల వినియోగంపై తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్టాలను ధిక్కరించి ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని, లాఠీ ఝుళిపించి గాడిలో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

గాయని మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని ఒక ప్రైవేటు రిసార్టులో తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. వీరిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రిసార్టుపై ఆకస్మికంగా దాడి చేశారు.

ఈ దాడుల్లో రిసార్టులో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ మద్యంతో పాటు కొంత మొత్తంలో గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. గాయని మంగ్లీ, విందు ఏర్పాటు చేసిన నిర్వాహకుడు, రిసార్టు యాజమాన్యం, అలాగే పరీక్షల్లో గంజాయి పాజిటివ్‌గా తేలిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. “చట్టాలను ధిక్కరించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే లాఠీ ఉపయోగించి అయినా గాడిలో పెట్టాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. “ఎంతటి ప్రముఖులైనా సరే, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆ పోస్టులో స్పష్టం చేశారు. చేవెళ్ల రిసార్టుపై దాడి చేసిన ఫొటోలను కూడా ఈ పోస్టుకు జతచేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *