టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, భారత్లో ఐఫోన్ల తయారీని గణనీయంగా పెంచేందుకు సిద్ధమవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) ముగిసే నాటికి దాదాపు 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.36 లక్షల కోట్లు) విలువైన ఐఫోన్లను భారత్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనాతో పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా విధిస్తున్న సుంకాల నేపథ్యంలో ఆపిల్ తన ప్రపంచ సరఫరా గొలుసును చైనా నుంచి ఇతర దేశాలకు తరలిస్తోంది. ఇందులో భాగంగా భారత్ను కీలక తయారీ కేంద్రంగా మార్చుకుంటోంది.
ఈ భారీ ఉత్పత్తి పెంపు ద్వారా అమెరికాలోని ఐఫోన్ల డిమాండ్లో 80 శాతం వరకు భారత్ నుంచే తీర్చాలని, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశీయ మార్కెట్ అవసరాలను పూర్తిగా తీర్చాలని ఆపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికం భారత్లో తయారైనవే ఉంటాయని ఆయన వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాల కారణంగానే ఉత్పత్తి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని కుక్ తెలిపారు.
ఐఫోన్ల తయారీ భారత్కు తరలిస్తుండగా, ఐప్యాడ్లు, మ్యాక్బుక్స్, ఆపిల్ వాచ్లు, ఎయిర్పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల తయారీని వియత్నాంకు మళ్లిస్తున్నట్లు సమాచారం. అమెరికా సుంకాల వల్ల ప్రస్తుత త్రైమాసికంలో సుమారు 900 మిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని యాపిల్ అంచనా వేస్తోంది.
భారత ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఊపందుకుంది. ఈ అవకాశాన్ని ఆపిల్ అందిపుచ్చుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 2 లక్షల కోట్లకు చేరగా, ఇందులో ఆపిల్ వాటానే దాదాపు 70 శాతంగా ఉంది. తయారీతో పాటు, భారత్లో తమ రిటైల్ కార్యకలాపాలను కూడా ఆపిల్ విస్తరిస్తోంది. ఇప్పటికే ఉన్న రెండు స్టోర్లకు అదనంగా మరిన్ని స్టోర్లను ఈ ఏడాది ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది