భూభారతి చట్టం రైతులకు రక్షణ కవచంగా పనిచేస్తుంది: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Nalgonda Bureau
2 Min Read

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచంగా పనిచేస్తుంది: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


ఆధార్ కార్డు మాదిరిగా రైతులకు భూ ఆధార్ కార్డ్

 

భూభారతి తో సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు: కలెక్టర్ ఇలా త్రిపాటి

ఏప్రిల్ 23 కట్టంగూర్ (ప్రజా జ్యోతి): భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచంలా పనిచేస్తుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. భూభారతి చట్టం- 2025 పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎలాంటి అన్యాయాలకు,అవకతవకులకు తావు లేకుండా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఇది వరకు ఉన్న ధరణి పోర్టల్ లో అధికారులకు నామమాత్రపు అధికారాలు ఉండేవని,దీనివల్ల అటు రైతులు, ఇటు ఆధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని,అలాంటి పద్ధతిని పూర్తిగా పునరుద్ధరించి భూ భారతి ద్వారా పూర్తిస్థాయిలో హక్కులు కల్పించే అవకాశాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల ఆర్ ఓ ఆర్ చట్టాలను అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నెలల పాటు అందరితో సమాలోచనలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ధరణి కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉండేదని,అలా కాకుండా తప్పులు లేని సమగ్ర చట్టం తేవాలని ప్రభుత్వం సంకల్పించి చెప్పిన మాట ప్రకారం భూ భారతి చట్టం తెచ్చిందన్నారు. భూ భారతి చట్టంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డు ను ప్రభుత్వం ఇస్తుందని,దీనివల్ల భూముల వివరాలన్నీ తెలుస్తాయన్నారు.అంతే కాక, భవిష్యత్తులో రైతుకుండే భూముల హద్దులతో సహా, మ్యాపింగ్ చేసి ఆన్లైన్ లో ఉంచడం జరుగుతుందన్నారు.రైతుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను గ్రామాలకు పంపించి పరిష్కరించునున్నదని ఆయన వెల్లడించారు.ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి భూములను సర్వే చేయించనుందని, భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించే బాధ్యత రెవెన్యూ శాఖదని, గతంలో ధరణిలో మాదిరి కాకుండా భూ భారతి చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుండి తొలగించే అధికారం ఉందని తెలిపారు.గతంలో ప్రభుత్వానికి దక్కాల్సిన భూములను కొద్ది మంది చేతుల్లో ఉంచుకున్న అంశంపై ఆమె మాట్లాడుతూ వాటన్నింటినీ సవరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు ధరణిలో సివిల్ కోర్టుకు తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని తహసిల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఆన్ సైన్డ్ ఖాతాలు, రికార్డుల నిర్వహణ భూ భారతిలో ఉందని తెలిపారు.ధరణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ భూ భారతిలో పరిష్కరిస్తామని, జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ పూర్తిస్థాయిలో అమలులోకి రానుందని తెలిపారు.అనంతరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ ను శాసనసభ్యులు,జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,నల్గొండ ఆర్ డి ఓ వై అశోక్ రెడ్డి,తహసిల్దార్ ప్రసాద్,కట్టంగూరు మండల ప్రత్యేక అధికారి,జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు,ఎంపీడీవో, తదితరులు హాజరయ్యారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *