- బిల్లుల క్లియరెన్స్కు లంచం అవతారం..
- 25 వేలు తీసుకుంటూ దొరికిపోయిన రమణారెడ్డి..!
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రభుత్వ జీతం తింటూ.. రక్తం చిందించి పనిచేసిన కాంట్రాక్టర్ల, రైతుల శ్రమను పిండుకోవడమే పనిగా పెట్టుకున్న ఒక అవినీతి తిమింగలం ఎట్టకేలకు చట్టానికి చిక్కింది. నర్సాపూర్ విద్యుత్ శాఖ సహాయ శ్రేణి (ఏడీఈ) రమణారెడ్డి 25 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
• పీడనపై ఉచ్చు..
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. ఒక కాంట్రాక్టర్ నర్సాపూర్ సబ్ డివిజన్ పరిధిలో రెండేళ్ల పాటు శ్రమించి 11 రకాల విద్యుత్ పనులు పూర్తి చేశారు. తీరా దానికి సంబంధించిన రూ.3.13 లక్షల బిల్లును పైఅధికారులకు పంపాలంటే ‘తన జేబు నింపాల్సిందే’ అంటూ ఏడీఈ రమణారెడ్డి రూ.30 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.25 వేలకు బేరం కుదిరింది. మరోవైపు కాగజ్ మద్దూర్ రైతు వద్ద కూడా ట్రాన్స్ఫార్మర్ మంజూరికి ఈయన చేతులు చాచినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకటేశం, రమేశ్ బృందం శుక్రవారం కార్యాలయంలోనే వ్యూహాత్మకంగా దాడి చేసింది. లంచం సొమ్ము తీసుకుంటుండగా రమణారెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, ఆయన అవినీతి రంగును రసాయన పరీక్షల్లో నిరూపించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఆయన నివాసంలోను ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బాధితులను పీడించే ఇలాంటి అధికారులపై ఏసీబీ పంజా విసరడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
