రాహుల్ గాంధీది ఏ కులం? ఏ మతం? అని ప్రశ్నించిన బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని ఆయన అన్నారు. మతాన్ని లేదా కులాన్ని చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆయన అన్నారు.
బీసీ వర్గాలను బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన అంశాన్ని వారు తప్పుపడుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టకుండా బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
కాగా, కులగణనను బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులమేమిటో చెప్పాలని నిలదీశారు. దీంతో శ్రీధర్ బాబు పైవిధంగా స్పందించారు.