ఈటీవో మోటార్స్తో కలిసి ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫ్లిక్స్ బస్ ఇండియా
బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
విజయవాడ-విశాఖ మధ్య కూడా త్వరలోనే అందుబాటులోకి విద్యుత్తు బస్సులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ.. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు.