కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. మంత్రి సురేఖ ఎన్నికల ఖర్చుపై ఈసీకి బీజేపీ నేత ఫిర్యాదు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల వ్యయం విషయంలో కొత్త చిక్కుల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఖర్చు చేసి, ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేశారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలే ఈ ఫిర్యాదుకు ప్రధాన కారణంగా నిలిచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తాము సుమారు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇందుకోసం తమకున్న 500 ఎకరాల భూమిలో 16 ఎకరాలు అమ్మవలసి వచ్చిందని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఉన్నత వర్గాలతోనే పోటీపడ్డానని, తనకు ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల వ్యయ పరిమితిని మించి ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలను ఆధారంగా చూపుతూ, ప్రదీప్ రావు తన ఫిర్యాదును ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖపై బీజేపీ అభ్యర్థిగా ప్రదీప్ రావు పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఖర్చుకు, వాస్తవ ఖర్చుకు పొంతన లేదని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా ఇదే అంశంపై ఈసీని ఆశ్రయించారు. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఫిర్యాదు అందడంతో కొండా సురేఖపై ఒత్తిడి పెరుగుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *