వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు. డీసీసీ, పరిశీలకుడి నివేదిక అందిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు. ఆ ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా టీపీసీసీ చీఫ్ స్పందించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడటం సరికాదని సూచించానని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం కోసమే అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారని తెలిపారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు.