హన్మకొండ, వరంగల్ జిల్లా న్యాయస్థానాలకు శుక్రవారం బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు నేరుగా డయల్ 100కు ఫోన్ చేసి కోర్టు ప్రాంగణాల్లో బాంబులు అమర్చినట్లు చెప్పడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కోర్టు సిబ్బంది ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు.
వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి జిల్లా కోర్టుల ప్రాంగణాలకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో కోర్టు కార్యకలాపాలకు కొంతసేపు అంతరాయం కలిగింది. న్యాయవాదులు, కోర్టు పనుల నిమిత్తం వచ్చిన వారు, కోర్టు సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి బాంబు బెదిరింపు కాల్ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.