తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పగలు ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.. ఇటీవల వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి.. రుతుపవనాల మందగమనం, రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు పెరిగాయి.. రుతుపవనాలు మందగించడంతో నాలుగు రోజులుగా ఎండలు పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రోహిణి కార్తె ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది.
గురువారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న బుధవారం జంగమేశ్వరపురంలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.., నర్సాపూర్ 40.9, కావలి, నెల్లూరులో 39.6, తుని, గన్నవరంలో 39.4, నంద్యాలలో 39, వైఎస్ఆర్ కడపలో 38.2, తిరుపతిలో 38 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ రిపోర్ట్..
ఇదిలాఉంటే.. తెలంగాణలో సైతం ఎండలు పెరిగాయి.. నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతుండడముతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. అయితే, గురువారం, శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగాల నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పింది. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ, భద్రాచలం లలో 38, కనిష్టంగా మహబూబ్ నగర్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.