విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలే తప్పు చేసింది. పదకొండు, పన్నెండు సంవత్సరాల బాలురులతో చెయ్యకూడని పని చేసింది. మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకుని తన కోరికలు తీర్చుకుంది. ఓ విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ జైలుపాలైంది. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు ఆమెకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
అమెరికాలో జరిగిన ఈ అమానవీయ సంఘటన వివరాలు.. శాండియాగోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూలులో జాక్వెలిన్ మా (36) టీచర్ గా పనిచేసేది. శాండియాగోలోనే అత్యుత్తమ టీచర్ అవార్డును సైతం అందుకుంది. అయితే, జాక్వెలిన్ మా తను పాఠాలు చెప్పే 12 ఏళ్ల విద్యార్థిపై కన్నేసింది. బాలుడితో ప్రేమగా ఉంటూ, బహుమతులు ఇస్తూ హోంవర్క్ చేసిపెడుతూ మచ్చిక చేసుకుంది. మాయమాటలు చెప్పి ఆ బాలుడితో తన శారీరక కోరికలు తీర్చుకుంది. దాదాపు పది నెలల పాటు బాలుడితో ఎఫైర్ కొనసాగించింది. బాలుడికి లవ్ లెటర్స్ రాయడం, ఫోన్ లో ప్రేమ సందేశాలు పంపడం చేసింది. అంతకుముందు పదకొండేళ్ల వయసున్న బాలుడితోనూ ఇలాగే చేసింది.
కొడుకు స్కూలు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా వచ్చాక ఫోన్ లో మునిగిపోవడం, టీచర్ తో గంటల తరబడి ఛాటింగ్ చేస్తుండడంతో తల్లి అనుమానించింది. కొడుకుకు చదువు చెప్పే టీచర్ జాక్వెలిన్ మాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తులో జాక్వెలిన్ మా బాగోతం బయటపడడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత జాక్వెలిన్ మా నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన తప్పు ఒప్పుకుంటూ క్షమించాలని కోర్టులో వేడుకున్న జాక్వెలిన్ మా.. న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే కన్నీటిపర్యంతమైంది. మైనర్ విద్యార్థితో జాక్వెలిన్ మా చేయకూడని పని చేసినందుకు శేష జీవితం అంతా జైలులోనే గడపనుంది.