హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికోసం అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈభేటీలో పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఆరా తీశారు సీఎం రేవంత్. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపామని.. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు 24వేల 269 కోట్ల అంచనాలతో డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు భరించేలా జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది.
అయితే కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిర్వీరామంగా ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏను ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.