ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు
యువత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా, స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి
అందరూ సమానంగా ఉండాలని, అంటరానితనమన్నదే ఉండకూడదని, అంటరానితనం నిర్మూలనకు కృషి
వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకొచ్చారు
రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్
నల్గొండ ఏప్రిల్ 05(ప్రజాజ్యోతి ప్రతినిధి): యువత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా, స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరాని వారికి తన జీవితాన్ని అంకితం చేశారని, అందరూ సమానంగా ఉండాలని, అంటరానితనమన్నదే ఉండకూడదని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు. వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకొచ్చారని, ప్రత్యేకించి వ్యవసాయంలో హరిత విప్లవానికి కృషి చేశారన్నారు. ఈరోజు దేశంలో ఎగుమతులు మంచి, స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ లోక సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. నల్గొండ జిల్లాలో అభివృద్ధిలో భాగంగా ఈనెల 7న అడ్వాన్సుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ,దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం ప్రత్యంకించి దళితులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమని పోలీస్ శాఖను అభినందించారు. ప్రతి ఒక్కరూ క్రమ పద్ధతిలో జీవన విధానం మలచుకొని ముందుకు వెళ్లి జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ ను బాగు చేయించేందుకు 25 లక్షల రూపాయలను జిల్లా మినరల్ ఫండ్ నుండి ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ తో కోరారు. అంతేకాక తన ఎమ్మెల్యే నిధుల నుండి మరికొంత మొత్తాన్ని ఇస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం కింద దళితులకు స్వయం ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయని ,వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దళిత యువతకు అయిన విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్సి స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, అంతేగాక వన్ టౌన్ లో ఉన్న లైబ్రరీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున దాని స్థానంలో మోడల్ లైబ్రరీని కడతామని, ఎస్ ఎల్ బి సి వద్ద 25 ఎకరాలలో అన్ని వర్గాల వారికి 6 నుండి 12వ తరగతి వరకు చదివేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు ఇదివరకే మంజూరు చేసిందని వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామనిమంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎలాంటి వనరులు లేని బీహార్ లాంటి అత్యంత వెనుకబడిన “ఆరా” ప్రాంతం నుండి వచ్చిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంచలంచలుగా ఎదుగుతూ భారత ఉప ప్రధానిగా అయ్యారని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ వారి వ్యూహాన్ని నేర్చుకోవాలన్నారు. గంగ పరివాహక ప్రాంతంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడంలో, ఆ ప్రాంతాన్ని వీట్ బౌల్ గా ఎలా చేయాలో అన్న విషయమై ఆయన చేసిన అధ్యయనం గొప్పదన్నారు. ఆయన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా తన స్పష్టమైన మార్పు చూయించారన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడని, ప్రతి ఫోర్టు పోలియోలో తనదైన ముద్రను వేశారన్నారు. దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరువలేనిదని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు మర్రి గూడా చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, చక్రాల రామరాజు, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, దున్న యాదగిరి,బుర్ర సుధాకర్ తదితర దళిత నాయకులు మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా కలా ప్రదర్శన ఇచ్చారు.