శాంతి భద్రతల తో పాటు, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం

V. Sai Krishna Reddy
3 Min Read

శాంతి భద్రతల తో పాటు, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో కనీసం 30 వేల బేసిక్ పే నుండి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషకరం

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ ఏప్రిల్ 05(ప్రజాజ్యోతి ప్రతినిధి): శాంతి భద్రతల తో పాటు, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ శాఖను అభినందించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో కనీసం 30 వేల బేసిక్ పే నుండి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషమని అన్నారు. పోలీసులు 24 గంటలు పని చేసే ఉద్యోగులుగా ప్రజల భద్రతతో పాటు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పోలీస్ తరఫున ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించడం జిల్లాలో మొదటిదని అన్నారు. ఈ జాబ్ మేళాలో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉద్యోగాల కోసం వచ్చారని అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరో జాబ్ మేళాను త్వరలోనే నల్గొండ లో ఏర్పాటు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో మిషన్ పరివర్తనను అమలు చేయడం, అలాగే ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారు మొదటిసారి వేతనం తక్కువగా ఉన్నప్పటికీ నిరాశపడవద్దని, అనుభవం కోసం కృషి చేయాలని, తాను కూడా మొదటి సారి 18000 /-రూపాయల ఇంటర్న్షిప్ తో బొంబాయి లో పని చేశానని తెలిపారు. ఎంత దూరంలో ఉద్యోగం వచ్చినా పనిచేయాలని, భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 112 కంపెనీలు వచ్చాయని, సుమారు 2500 ఖాళీలు ఈ జాబ్ మేళాలో భర్తీ చేయనున్నామని, 4,000 మంది అభ్యర్థులు ఇప్పటివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువగా 45 వేల జీతానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు. యువత సంఘవిద్రోహ శక్తులుగా తయారు కాకుండా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారు మొదటి ఉద్యోగం అని తేలికగా తీసుకోకుండా, కష్టపడి పని చేయాలని, రానివారు నిరాశ పడవద్దు అని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం యువతేజం అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. జాబ్ మేళాలో హాజరైన వారందరికీ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయం కల్పించడం పట్ల ఆయన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక వందన సమర్పణ చేయగా, డీఎస్పీ శివరాంరెడ్డి, జాబ్ కో-ఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *