రేపు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివరాత్రి సందర్భంగా ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, పానగల్లు, పాలకుర్తి, వరంగల్ వేయి స్థంభాల గుడి, కాశిబుగ్గ శివాలయం, భద్రకాళి ఆలయం తదితర దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆయా దేవాలయాల్లోని ఏర్పాట్లపై అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్మెంట్, తాగునీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, విద్యుద్దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు.