జాతీయ రహదారి భద్రత మహోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పరిగి ఎస్సై మోహన కృష్ణ

పరిగి, జనవరి 21 (ప్రజాజ్యోతి):పరిగి పట్టణములో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి భద్రత మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పరిగి పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే తీవ్ర రోడ్డు ప్రమాదాలు సంభవించి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇటీవల మద్యం సేవించి లారీ నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి పరిగి కోర్టు పది రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మొన్నటికి మొన్న అజాగ్రత్తగా రోడ్డు దాటే క్రమంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జైలు శిక్ష కూడా తప్పదని పరిగి ఎస్సై మోహన కృష్ణ స్పష్టం చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని తెలిపారు.
