దేశంలో 3,395 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు

V. Sai Krishna Reddy
1 Min Read

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, గత 24 గంటల్లో నలుగురు ఈ మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో అధికార వర్గాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

శనివారం నాటికి దేశంలో మొత్తం 3,395 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 685 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇదే సమయంలో ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 22న దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మే 26 నాటికి 1,010కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగి 3,395కి చేరుకుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసుల్లో కేరళలో అత్యధికంగా 1,336 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్‌లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్‌లో 117 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహల్ ఇదివరకే కీలక విషయాలు వెల్లడించారు. దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల జన్యు క్రమాన్ని విశ్లేషించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమవుతున్న వేరియంట్లు ఒమిక్రాన్ ఉపరకాలేనని, ఇవి అంత తీవ్రమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. LF.7, XFG, JN.1, NB.1.8.1 అనే నాలుగు ఒమిక్రాన్ ఉపరకాలు కనుగొన్నామని, వీటిలో మొదటి మూడు రకాలు ఎక్కువ కేసుల్లో కనిపిస్తున్నాయని ఆయన వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *