భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు

V. Sai Krishna Reddy
1 Min Read

భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను ఇటీవల భారత్‌లో కనుగొన్నారు.

NB.1.8.1 కొవిడ్ వైరస్ కేసు ఒకటి ఏప్రిల్‌లో తమిళనాడులో నమోదయింది. మే నెలలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ రెండు సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు.

దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కొవిడ్ సంబంధిత మరణం నమోదయింది. కొవిడ్‌తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్‌ పాజిటివ్ అని తేలింది.

మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. రాష్ట్రంలో నాల్గవ కొవిడ్‌-19 మరణం నమోదయింది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో 21 సంవత్సరాల వ్యక్తి థానేలో మరణించాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *