తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. దక్షిణ కాశీగా పేరొందిన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో 42 ఏళ్ల తర్వాత ప్రత్యేక చొరవతో సురేఖ మహా కుంభాభిషేకం నిర్వహించడమే ఇందుకు కారణం. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించడం హర్షణీమంటూ మంత్రికి సోనియా లేఖ రాశారు.
ఈ సందర్భంగా తనకు త్రివేణి సంగమం పవిత్ర జలాలను, ప్రసాదాన్ని పంపించినందుకు కొండా సురేఖకు లేఖ ద్వారా సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి స్థల విశిష్టతను, ప్రాశస్త్యాన్ని తెలియజేసినందుకు మంత్రిని అభినందించారు.
కాగా, 1982లో తొలిసారి కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో ఇక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 42 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు మహా కుంభాభిషేకం వేడుకలను నిర్వహించారు.