పిడుగుపాటుకు సేవాలాల్ ఆలయ గోపురం కు పగుళ్లు 
ఉరుములు.. మెరుపులతో గాంధారిలో భారీ వర్షం
గాంధారి, సెప్టెంబర్ 20 (ప్రజాజ్యోతి )
గాంధారి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ ఆలయ గోపురంపై పిడుగు పడటంతో నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగుపాటు ధాటికి గోపురానికి పగుళ్లు ఏర్పడి కొంతభాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సేవాలాల్ ఆలయంపై పిడుగు పడిన విషయం తెలుసుకున్న భక్తులు, స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆలయ గోపురం దెబ్బతినడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
