ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఓ శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు మేలు చేకూర్చే కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చని సమాచారం. ఈ ప్రకటనల్లో భాగంగా ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కరువు భత్యం (డీఏ)లలో ఒకదానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అంతేకాకుండా, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అదే రోజు చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా ఒక నూతన ఆరోగ్య పథకాన్ని కూడా ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి నుంచి వినతులు స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. ఉద్యోగులు ప్రస్తావించిన కొన్ని ప్రధాన డిమాండ్లకు కమిటీ సానుకూలంగా స్పందించి, వాటిని ఆమోదించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

ఈ కమిటీ ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై, తమ సిఫార్సులతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఈ నివేదికను ఆమోదించిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. జూన్ 2న వెలువడనున్న ఈ ప్రకటనల కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *