భారతీయ పాటల ప్రసారాన్ని ఆపివేసిన పాకిస్థాన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లు

V. Sai Krishna Reddy
2 Min Read

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (పీబీఏ) ప్రకటించింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఈ విషయాన్ని పీబీఏ సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ గురువారం అధికారికంగా వెల్లడించారు. “పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసింది,” అని ఆయన తెలిపారు. వాస్తవానికి, లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ముఖేష్ వంటి దిగ్గజ గాయకుల పాటలతో సహా భారతీయ సంగీతానికి పాకిస్థాన్‌లో ఎంతో ఆదరణ ఉంది. అక్కడి ఎఫ్‌ఎం రేడియోలలో ప్రతిరోజూ భారతీయ పాటలు ప్రసారమవుతుంటాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అధిక శాతం పర్యాటకులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఈ దాడికి సరిహద్దు ఆవల నుంచి సంబంధాలున్నాయని ఆరోపిస్తూ భారత్, పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు ప్రకటించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ వద్ద ఉన్న ఏకైక భూ సరిహద్దు మార్గాన్ని మూసివేయడం, దౌత్య సంబంధాలను తగ్గించుకోవడం వంటి చర్యలను భారత్ చేపట్టింది. పాకిస్థానీ విమానయాన సంస్థల విమానాల కోసం తమ గగనతలాన్ని కూడా భారత్ మూసివేసింది.

ఈ క్రమంలోనే పాక్ ఎఫ్‌ఎం రేడియోల్లో భారతీయ పాటల నిషేధం తెరపైకి వచ్చింది. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ పాటలను తక్షణమే నిలిపివేయాలని పాక్ ప్రభుత్వమే పీబీఏను ఆదేశించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీబీఏ నిర్ణయాన్ని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ ప్రశంసించారు. “పీబీఏ తీసుకున్న ఈ దేశభక్తి నిర్ణయం ఎంతో ప్రశంసనీయమని, ఇది జాతి యావత్తు సమిష్టి స్పూర్తికి నిదర్శనమని” ఆయన పీబీఏకి రాసిన లేఖలో పేర్కొన్నారు. “ఇలాంటి క్లిష్ట సమయాల్లో జాతీయ ఐక్యతను ప్రోత్సహించడంలో, కీలక విలువలకు మద్దతివ్వడంలో మనమంతా ఐక్యంగా ఉన్నామని పాక్ ఎఫ్‌ఎంలలో భారతీయ గీతాలను నిషేధించడం స్పష్టం చేస్తోంది” అని తరార్ వ్యాఖ్యానించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *