బంగ్లాదేశ్ గొంతు కూడా ఎండబెట్టండి !

V. Sai Krishna Reddy
3 Min Read

పాకిస్థాన్ విషయంలో అనుసరించిన విధానాన్నే బంగ్లాదేశ్ విషయంలోనూ అనుసరించాలని ఒక డిమాండ్ ఊపందుకుంటోంది. పాక్ పాత శతృవు అయితే బంగ్లాదేశ్ కొత్త శత్రువు అని గుర్తు చేస్తున్నారు. పాముకు పాలు పోసినట్లుగా పొరుగు శత్రువులకు నీళ్ళు పోసి పెంచొద్దు అని సూచనలు వస్తున్నాయి. భారత్ నుంచి ప్రవహించే నదుల నీటిని వీరిని అందిస్తూంటే ఉగ్రవాదులతో భారత్ మీదనే దండెత్తుతున్నారని అందువల్ల వారి పీచమణచాలని కోరుతున్నారు. పాకిస్థాన్ కి సింధు నదీ ఒప్పందం రద్దు చేయడం ద్వారా భారత్ గట్టి బుద్ధి చెప్పిందని ఇపుడు నీరు లేక ఎండబెట్టలసింది బంగ్లాదేశ్ ని కూడా అని అంటున్నారు. ఆ గంగా నదిని ఆ దేశంలో నీరు పారనీయకుండా చేయాలని కోరుతున్నారు.

గత కొంతకాలంగా బంగ్లాదేశ్ భారత్ కి విరోధిగా మారింది. భారత్ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతోంది. భారత్ మీద అకారణంగా విషం చిమ్ముతోంది. దాంతో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎక్కువ అవుతోంది. అంతే కాదు భారత్ దాయాదిగా ఉన్న పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సన్నిహితమవుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అందువల్ల భారత్ నుంచి బంగ్లాదేశ్ గుండా పాకే గంగా, బ్రహ్మపుత్ర నదీ జలాల ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నారు.

ఇక కొత్తగా మరో సంచలన విషయాలను బంగ్లాదేశ్ విషయంలో ముందుకు తెస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక పాకిస్థాన్ తోక జాడించకుండా అత్యంత కఠిన చర్యలకు భారత్ దిగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలతో ఉక్కు పాదం మోపడానికి చూస్తోంది. దానికి శభాష్ అంటున్న వారే ఇదే ఊపులో బంగ్లాదేశ్ విషయంలోనూ కఠినంగా ఉండాలని కోరుతున్నారు. బంగ్లాదేశ్ విషయంలో సీరియస్ నిర్ణయాలు అవసరమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్‌పై కూడా దృష్టి సారించాలని సూచిస్తున్నారు. తాజాగా ఒక అధికారిక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుత భారత్ ఇప్పటికిపుడే బంగ్లాదేశ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారత్ భద్రత దృష్ట్యా ఇవన్నీ వ్యూహాత్మక నిర్ణయాలుగా ఉంటాయని ఆయన అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను పరిశీలిస్తుందని భావిస్తున్నానని ఆయన అంటున్నారు. ఇక బంగ్లాదేశ్ వైపుగా పారే నదీ జలాల పంపకాల విషయంలో హిమంత బిశ్వ శర్మ కీలకమైన అంశాలనే లేవనెత్తారు. గతంలో బంగ్లాతో తీస్తా నదీ జలాల ఒప్పందాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించిన విషయాన్ని సైతం ఆయన గుర్తు చేశారు. ఇక బ్రహ్మపుత్ర నది నీటిని కూడా బంగ్లాదేశ్‌కు వెళ్లకుండా నిలిపివేయాలని ఆయన సూచించారు.

ఇలా ఎంతకాలం మనం ఇలాంటి పాములకు నీళ్లు అందిస్తామని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వారిని అణచివేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదీ జలాల ఒప్పందాలను రద్దు చేసే విషయంలో దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తగిన చర్యలు తీసుకోవాలని శర్మ కోరారు. ప్రజలంతా ఈ వైఖరికి మద్దతు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరో వైపు చూతే కనుక పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న సన్నిహిత సంబంధాలపై తాను ముందే అధికారులను అప్రమత్తం చేశానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ఇక ఇదే తీరున బీజేపీ నేత, ఎంపీ నిశికాంత్ దూబే కూడా తన ఆందోళన వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఘాటుగానే ఆరోపించారు.

అందువల్ల ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తరహాలోనే 1996లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు.

మొత్తం మీద పాక్ నోట్లో నీళ్ళు పోయకుండా సింధు నదీ ఒప్పందం రద్దు చేసిన మోడీ ప్రభుత్వం ఇపుడు బంగ్లాదేశ్ కి కూడా అదే గతి పట్టిస్తుందా అన్న చర్చ సాగుతోంది. భారత్ లో బంగ్లాదేశ్ మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. నమ్మించి వెన్నుపోటు పొడిచిన దేశంగా దానిని చూస్తున్నారు. అందువల్ల బంగ్లాదేశ్ మీద భారత్ ఇదే అదనుగా కఠిన చర్యలకు దిగితే మంచిదని అంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *