కన్నకొడుకు అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబం, వితంతువుగా మారిన కోడలి భవిష్యత్తు గురించి ఆలోచించింది. సమాజం ఏమనుకుంటుందోనన్న సంకోచాలను పక్కనపెట్టి, ఆ కోడలికి స్వయంగా తండ్రి స్థానంలో నిలిచి, మరో వ్యక్తితో వివాహం జరిపించి కొత్త జీవితాన్ని అందించారు ఆ మామగారు. గుజరాత్లోని అంబాజీలో జరిగిన ఈ సంఘటన మానవత్వానికి, కుటుంబ విలువలకు అద్దం పడుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళితే, అంబాజీకి చెందిన ప్రవీణ్ సింగ్ రాణా పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్కు కృష్ణ అనే యువతితో వివాహమైంది. వారికి దీక్షిత అనే కుమార్తె ఉంది. అయితే, గత దీపావళి పండుగ సమయంలో సిద్ధరాజ్ సింగ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ఊహించని ఈ పరిణామంతో కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా రాణా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. భర్త లేని జీవితం, తండ్రి లేని కుమార్తె భవిష్యత్తు ఎలా అనే ఆందోళనలో కృష్ణ మునిగిపోయింది.
ఈ పరిస్థితుల్లో మామ ప్రవీణ్ సింగ్ రాణా ఒక సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. కోడలిని తన కన్న కూతురిలా భావించి, ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. సమాజం ఏమనుకుంటుందోనని భయపడకుండా, తన దివంగత కుమారుడు సిద్ధరాజ్ సింగ్ ప్రాణ స్నేహితుడైన సంజయ్తో కృష్ణకు వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇరుపక్షాల అంగీకారంతో, ప్రవీణ్ సింగ్ దగ్గరుండి కృష్ణ, సంజయ్ల వివాహాన్ని వైభవంగా జరిపించారు.
కోడలితో పాటు మనవరాలు దీక్షిత కూడా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ, వారిని అత్తారింటికి సాగనంపుతూ ప్రవీణ్ సింగ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కదిలించింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలియడంతో నెటిజన్లు ప్రవీణ్ సింగ్, ఆయన కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలే నేటి సమాజానికి ఆదర్శమని పలువురు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కృష్ణను వివాహం చేసుకున్న సంజయ్ మాట్లాడుతూ, “సిద్ధరాజ్ నా చిన్ననాటి స్నేహితుడు. కృష్ణ కూడా నాకు కొంతకాలంగా తెలుసు. ప్రవీణ్ సింగ్తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు. కృష్ణను, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని వారి కుటుంబానికి హామీ ఇస్తున్నాను” అని తెలిపారు. తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అత్తమామలకు కృష్ణ కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేసింది.