చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఆసీస్ ఈ మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. 2009 నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచి, ఆ సెంటిమెంటుకి ముగింపు పలకాలని గట్టి పట్టుదలతో ఉంది.
ఆస్ట్రేలియా చివరిసారి 2006, 2009లో వరుసగా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత మాత్రం ఒక్క మ్యాచ్ను కూడా గెలవలేకపోయింది. 2013లో గ్రూప్ స్టేజ్లో ఇంగ్లండ్, శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఫలితం తేలలేదు. 2017లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. రెండు మ్యాచ్లు రద్దయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ రోజు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్తో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లో గెలవడం ద్వారా శుభారంభం చేయాలని భావిస్తోంది. వన్డే ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న కంగారూ జట్టు అదే ఊపును ఇక్కడా కొనసాగించాలని యోచిస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరం కావడంతో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు.