తెలంగాణ పుర పోరు: మొదలైన ఓట్ల లెక్కింపు.. సాయంత్రానికి ఫలితాలు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 7 నగర పాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డులకు సంబంధించిన ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. మధ్యాహ్నం నాటికి పురపాలికల ఫలితాలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వెబ్‌కాస్టింగ్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మినహా ఇతరులను అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు.

నిబంధనల ప్రకారం, ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారు. వార్డులవారీగా బ్యాలెట్ పత్రాలను డ్రమ్ములో కలిపి, ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ప్రతి రౌండ్ తర్వాత ఫలితాలను ప్రకటించి, ఏజెంట్ల సంతకాలు తీసుకుంటున్నారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి పెద్ద కార్పొరేషన్లలో లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది.

ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *