- ధర్మసాగర్ గ్రామ పర్యావరణ పరిరక్షణ కోసం వార్డు మెంబర్ల ముందడుగు
- క్రషర్ అనుమతులకు ఎన్ఓసి ఇవ్వొద్దంటూ డిప్యూటీ తహశీల్దార్కు అభ్యంతర పత్రం అందజేత
ధర్మసాగర్, జనవరి 07(ప్రజాజ్యోతి)
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామంలో ఇప్పటికే ఉన్న క్రషర్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మరిన్ని క్రషర్లకు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు మెంబర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రషర్ అనుమతులకు ఎన్ఓసి ఇవ్వకూడదని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్కు అభ్యంతర పత్రాన్ని సమర్పించారు.
గ్రామ పరిధిలో పనిచేస్తున్న క్రషర్ల వల్ల దుమ్ము ధూళి, శబ్ద కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, వ్యవసాయ భూములు నష్టపోతున్నాయని వార్డు మెంబర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, క్రషర్ నిర్వాహకులు చేస్తున్న బ్లాస్టింగ్ ల వల్ల కోతులు అక్కడ ఉండలేక ఇండ్లలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్లున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో కొత్త క్రషర్కు సంబంధించిన ఎన్ఓసి నోటీసు వెలువడటంతో గ్రామ ప్రజల్లో భయం నెలకొందని, భవిష్యత్తులో పర్యావరణానికి మరింత హాని కలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ధర్మసాగర్ గ్రామాన్ని కాలుష్యరహితంగా, నివసించదగిన ప్రాంతంగా నిలుపుకోవాలంటే క్రషర్ అనుమతులను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రజల అభిప్రాయాలను, వార్డు మెంబర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని క్రషర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ వార్డు సభ్యులమైన మ్యాకలసాంబరాజ, కొట్టె భాను చందర్, బెల్లం ప్రేమ్ కుమార్, చిలుక ప్రతిభ, జాలిగపు కళ్యాణి, బొడ్డు రఘు ప్రసాద్ పాల్గొన్నారు.
