మారేడుమిల్లి అడవుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేత దేవ్‌జీ

V. Sai Krishna Reddy
1 Min Read

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి తుపాకుల మోత మోగింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.

 

ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్‌చంద్ర లడ్డా విజయవాడలో ధ్రువీకరించారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, వారిని ఏరివేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు.

నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురిని మట్టుబెట్టినట్లు డీజీ వివరించారు. హిడ్మా ఎదురుకాల్పుల్లోనే మరణించారని, ఆయన్ను పట్టుకుని చంపారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డీజీ తెలిపారు. ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. వీరిలో ముగ్గురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 23 మంది ప్లాటూన్ సభ్యులు ఉన్నారు. అరెస్టయిన వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో దాడులు పెరగడంతో మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశిస్తున్నారని, ఈ క్రమంలోనే పట్టుబడుతున్నారని ఆయన తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *