కుక్కల ప్రేమికులు పేదలను దత్తత తీసుకుని వీధులను కుక్కలకు వదిలేయాలి: రామ్ గోపాల్ వర్మ

V. Sai Krishna Reddy
1 Min Read

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యల అనంతరం దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడుల ఘటనలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈసారి ఆయన కుక్కల ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి.

కుక్కలు మీకు కుటుంబ సభ్యులతో సమానం అయితే, మీ ఇంట్లోని పెంపుడు కుక్కలనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?” అంటూ వర్మ సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా, “పేదలందరినీ మీ ఇళ్లలోకి తెచ్చుకుని, వీధులను పూర్తిగా కుక్కలకే వదిలేయొచ్చు కదా?” అని ఆయన తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. పాలకుల మౌనం కన్నా వీధికుక్కల అరుపులే మేలని, అందుకే పాలకుల స్థానంలో వాటినే కూర్చోబెట్టాలని వ్యాఖ్యానించారు.

వర్మ తన వ్యంగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తూ, “మీ పిల్లలను వీధికుక్కల గుంపుతో ఆడుకోవడానికి పంపించి, ప్రకృతితో బంధం పెంచుకోమని చెప్పగలరా?” అని నిలదీశారు. కుక్కలకు కూడా పిల్లలతో సమాన హక్కులు ఉన్నాయని భావిస్తే, వీధికుక్కల కోసం పాఠశాలలు, పిల్లల కోసం కొట్టాలు (కెన్నెల్స్) నిర్మించాలని అన్నారు. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి బదులు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని శునక ప్రియులకు ఆయన సలహా ఇచ్చారు. “కుక్కలను దేవుళ్ల కంటే ఎక్కువగా పూజిస్తున్నారు కాబట్టి, దేవాలయాల్లోని విగ్రహాలను తొలగించి, వాటి స్థానంలో వీధికుక్కలను పెట్టి మోక్షం కోసం ప్రార్థించండి,” అని వర్మ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన అభిప్రాయాలను కొందరు సమర్థిస్తుండగా, జంతు ప్రేమికులు, శునక ప్రియులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *