సిగాచి పేలుడు ఘ‌ట‌న‌.. 39కి చేరిన మృతుల సంఖ్య

V. Sai Krishna Reddy
1 Min Read

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 39కి చేరింది. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ రావు అనే కార్మికుడు ఈరోజు మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ శుక్రవారం ప్రమాద స్థలాన్ని సందర్శించనుంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి, ఏడు రోజుల్లోగా ప్రాథమిక నివేదికను సమర్పించనుంది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తించామని, మరో తొమ్మిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి 20 అస్థిపంజర భాగాలను వెలికితీసి, డీఎన్ఏ గుర్తింపు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఇప్పటికే 95 శాతం డీఎన్ఏ నమూనాల సేకరణ పూర్తయిందని ఎస్పీ పరితోశ్‌ పంకజ్ చెప్పారు.

ఇదిలా ఉండగా, గాయపడిన 33 మందిలో 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, వారికి తక్షణ సాయంగా రూ. 1 లక్ష చొప్పున అందించామని సిగాచి పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. జూన్ 30న టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారీలో వాడే పౌడర్ తయారుచేసే ఈ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *