ఊబకాయం సమస్యతో సతమతమవుతున్న వారికి ఊరటనిస్తూ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బరువు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని పేరుపొందిన ‘మౌంజారో’ (టిర్జెపటైడ్) ఇంజెక్షన్ను ఇకపై జనరల్ ప్రాక్టీషనర్లు (జీపీలు) కూడా సూచించేందుకు మార్గం సుగమమైంది. గతంలో కేవలం ప్రత్యేక బరువు తగ్గే సేవల ద్వారా మాత్రమే లభ్యమయ్యే ఈ ఔషధాన్ని, ఇప్పుడు తీవ్ర ఊబకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి జీపీలు (సాధారణ వైద్యులు) సిఫార్సు చేయవచ్చు. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ తయారుచేస్తున్న ఈ మందు, వాస్తవానికి చక్కెర వ్యాధి నివారణకు ఉద్దేశించినది కావడం విశేషం.
బ్రిటన్ ప్రభుత్వ అధీనంలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) పర్యవేక్షణలో ఈ మందు పంపిణీ జరగనుంది. రాబోయే మూడేళ్లలో అత్యంత అవసరమైన సుమారు 2,20,000 మందికి ఈ ఇంజెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మౌంజారో శరీరంలో ఆహారం జీర్ణం కావడాన్ని నెమ్మదిపరుస్తూ, రక్తంలోని చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. టైప్ 2 మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గడానికి ఉపయోగపడే ఈ ఔషధంలోని టిర్జెపటైడ్ అనే క్రియాశీలక పదార్థం, పేగుల్లోని జీఎల్పీ-1, జీఐపీ అనే రెండు హార్మోన్ రిసెప్టార్లను ప్రేరేపిస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
అయితే, మౌంజారో వాడకం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు వంటి కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సౌందర్య చికిత్స కాదని, కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మందులు వాడుతున్న మహిళలు సమర్థవంతమైన గర్భనిరోధక పద్ధతులు పాటించాలని కూడా యూకే ప్రభుత్వం సూచించింది. ఎంహెచ్ఆర్ఏ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ అలిసన్ కేవ్ మాట్లాడుతూ, “ఇవి నిర్దిష్ట వైద్య పరిస్థితులకు లైసెన్స్ పొందిన మందులు, సౌందర్య సాధనాలుగా లేదా బరువు తగ్గడానికి తక్షణ మార్గాలుగా పరిగణించరాదు” అని తెలిపారు.
ఇదిలావుండగా, భారత్లో కూడా మౌంజారోకు విశేష ఆదరణ లభిస్తోందని ఎలి లిల్లీ సంస్థ పేర్కొంది. మార్చిలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ ఔషధం, మే నాటికి 81,500 యూనిట్లకు పైగా అమ్ముడై, సుమారు రూ.24 కోట్ల వ్యాపారం చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఏప్రిల్, మే నెలల మధ్య అమ్మకాలు 60% పెరిగాయి. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని కంపెనీ తెలిపింది.