తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు మరియు వసతి గదుల కోటా విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సోమవారం ప్రకటించింది. భక్తులు ఈ తేదీలను గమనించి, తదనుగుణంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తితిదే సూచించింది.
శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు మరియు వసతికి సంబంధించిన టికెట్లను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, ఇతర అనధికారిక వెబ్సైట్లు లేదా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది.
వివరాల్లోకి వెళితే…
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
ఇ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు పొందిన భక్తులు, జూన్ 20 నుంచి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్దేశిత రుసుము చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేస్తారు.
అదేరోజు, అంటే జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
జూన్ 23వ తేదీన పలు ముఖ్యమైన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు అందుబాటులోకి వస్తాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ కోటా టికెట్లను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉచిత ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను (రూ.300) తితిదే ఆన్లైన్లో ఉంచుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలో వసతి గదుల బుకింగ్కు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నారు.
వీటితో పాటు, ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవీనత సేవ మరియు గ్రూప్ సూపర్వైజర్ల సేవల కోటాను జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.