ఘోరం.. మేడిగడ్డ బ్యారేజీలో ఆరుగురు యువకుల గల్లంతు

V. Sai Krishna Reddy
1 Min Read

ఈత సరదా ఆరుగురి యువకుల నిండు ప్రాణాలు బలి తీసుకుంది. అందరూ 20 ఏళ్లలోపు వారే. బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి.. సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగగా.. ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురూ చూస్తుండగానే గుంతలో కూరుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజ్‌ ఎగువ ప్రాంతంలో శనివారం (జూన్‌ 7) చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట రెండు రోజుల కిందట పెళ్లి సంబరం జరిగింది. బంధుమిత్రులు బాగానే వచ్చారు. అయితే వారిలో ఎనిమిది మంది శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సరదాగా స్నానం చేసేందుకు మేడిగడ్డ వద్ద ఉన్న గోదావరి నదిలో దిగారు. అందులో తొలుత ఓ యువకుడు దిగగా.. కాసేపటికే మునిగిపోవడం ప్రారంభించాడు. గమనించిన అతని సోదరుడు కాపాడేందుకు యత్నించి అతడూ మునిగిపోయాడు. అలా ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. బాధితులను అంబట్‌పల్లికి చెందిన మధుసూదన్‌ (18), శివమనోజ్‌ (15), రజిత్‌ (13), కర్ణాల సాగర్‌ (16)తో పాటు కోరకుంట్ల వాసి రామ్‌చరణ్‌ (17), స్తంభంపల్లి వాసి రాహుల్‌ (19)గా గుర్తించారు. గోదావరిలో గల్లంతైన ఈ ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదం నుంచి పట్టి శివమణి ప్రాణాలతో బయటపడ్డాడు. వీరు నది వద్దకు చేర్చి ఆటోను నదికి దగ్గర్లో నిలిపి వస్తున్న పట్టి వెంకటస్వామి కళ్లముందే ఆయన ఇద్దరు కుమారులు మధుసూదన్, మనోజ్‌లు నీళ్లలో గల్లంతయ్యారు. యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గాలిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *