స్వర్ణ దేవాలయంలో ఆయుధాలకు అనుమతి’ వార్తలపై భారత సైన్యం స్పందన

V. Sai Krishna Reddy
1 Min Read

అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఆయుధాలను మోహరించలేదని స్పష్టం చేసింది. ఇదే అంశంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) కూడా స్పందిస్తూ, సైన్యానికి అటువంటి అనుమతులు ఏవీ ఇవ్వలేదని తేల్చి చెప్పింది.

“స్వర్ణ దేవాలయంలో ఎయిర్‌ డిఫెన్స్‌ తుపాకులను మోహరించినట్లుగా మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఆలయ ప్రాంగణంలో ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ తుపాకులు గానీ, ఇతర ఆయుధ వ్యవస్థలను గానీ మోహరించలేదు” అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది.

పాకిస్థాన్ నుంచి డ్రోన్లు లేదా క్షిపణుల ద్వారా దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో, వాటిని తిప్పికొట్టేందుకు స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఆయుధాలను మోహరించడానికి ఆలయ నిర్వాహకులు అంగీకరించారని ఒక సైనికాధికారి పేర్కొన్నట్లు వార్తలు రావడంతో భారత సైన్యం వివరణ ఇచ్చింది.

ఎస్‌జీపీసీ స్పందన

శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) కూడా ఈ వార్తలపై స్పందించింది. భారత సైన్యానికి స్వర్ణ దేవాలయం లోపల ఆయుధాలు ఉంచడానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఎస్‌జీపీసీ స్పష్టం చేసింది. ఆలయ పవిత్రతను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని కోరింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *