పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయితే, ఉద్రిక్తతలు నెలకొన్నవేళ సరిహద్దులో అలజడి కొనసాగుతోంది. పాక్ సైన్యం వరుసగా నాలుగో రోజు ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పూంఛ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.
“ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి వేళ పూంఛ్, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ లక్షిత కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి శత్రువుల దాడిని తిప్పికొట్టాయి” అని భారత సైన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, పూంఛ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి అని భారత అధికారులు తెలిపారు.