పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది దేశంపై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇండియాపై పాక్ ఆంక్షలకు దిగింది. ఈ క్రమంలో తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
పాక్ ఎయిర్లైన్లకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు సమాచారం. ఒకవేళ భారత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే… అది పాక్ ఎయిర్లైన్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్థాన్ ఫ్లైట్స్ సింగపూర్, థాయ్లాండ్, మలేసియా తదితర దేశాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు ఇండియా బ్యాన్ చేస్తే… దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయంలో పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తడిసి మొపెడవుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్ విమానయాన సంస్థలకు ఇది మరింత భారంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక, భారత విమానాలపై తమ గగనతలంలో ప్రవేశించకుండా నిషేధం విధించిన పాక్ ఇప్పటికే భారీగా నష్టపోతున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల మనకంటే కూడా దాయాది దేశానికే ఎక్కువ ఆర్థిక నష్టమని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా వారానికి 800కి పైగా అంతర్జాతీయ విమానాలు రాకపోకలు కొనసాగించేవి. ఇందుకోసం ఓవర్ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు 1లక్ష 20వేల డాలర్లు వసూలు చేసేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పాక్ నష్టపోవాల్సిందే.