తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట పట్టణంలో ఒక సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఖాదర్పుర వీధిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అదృశ్యం కావడం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. శనివారం ఉదయం నుంచి వారు కనిపించకపోవడంతో బంధువులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే, ఖాదర్పురలో నివాసం ఉంటున్న బాలకిషన్, ఆయన తండ్రి జనార్దన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రావణ్, కుమార్తెలు కావ్య, శిరీష శనివారం నుంచి కనిపించడం లేదు. వారు తమ సెల్ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలి వెళ్లడం గమనార్హం. మొదట బంధువులు, చుట్టుపక్కల వారు ఏదైనా ఊరికి వెళ్లి ఉంటారని భావించారు. అయితే, రెండు రోజులు గడిచినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పుల భారం వల్లేనా?
బాలకిషన్కు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు కూడా ఉన్నాయని బంధువులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు బాలకిషన్ ఒక లేఖ రాసిపెట్టారని వారు పోలీసులకు తెలిపారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ మధు మీడియాకు తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.