సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకుంటున్న తెలంగాణ వాసులు

V. Sai Krishna Reddy
2 Min Read

సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఇతర పౌరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలివస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తూ, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది.

ఆదివారం నాటికి దాదాపు 86 మంది తెలంగాణ వాసులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 26 మందిని వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా అవసరమైన వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.

తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరో 100 మంది వరకు తెలంగాణ వాసులు భవన్‌కు చేరుకునే అవకాశం ఉందని, వారికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. వసతి, భోజనం, వైద్య సేవలు, వారి స్వస్థలాలకు రవాణా వంటి అంశాలపై ఆయన ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న వారికి, స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లాలనుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

ఇంతకుముందే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకు చెందిన పౌరులకు సంపూర్ణ సహాయం అందించడమే ఈ కంట్రోల్ రూమ్ లక్ష్యమని పేర్కొంది. ఇక్కడకు వచ్చే వారికి ఉచిత భోజనం, వసతితో పాటు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి, వారి ప్రయాణాలకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

జమ్మూ, పంజాబ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వారికి అన్ని విధాలా సహాయం అందించి, హైదరాబాద్‌కు సురక్షితంగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, మద్దతు అందించేందుకే ఈ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. అవసరమైన వారు తక్షణ సహాయం కోసం కింద సూచించిన నంబర్లలో సంప్రదించాలని రెసిడెంట్ కమిషనర్ కోరారు.

సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
* ల్యాండ్‌లైన్: 011-23380556
* వందన (రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ, లైజన్ హెడ్): 9871999044
* హైదర్ అలీ నఖ్వీ (రెసిడెంట్ కమిషనర్ పర్సనల్ అసిస్టెంట్): 9971387500
* జి. రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్): 9643723157
* సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్): 9949351270

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *