ఢిల్లీ విమానాశ్రయంలో 138 విమానాల రద్దు

V. Sai Krishna Reddy
1 Min Read

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం 138 విమానాలను రద్దు చేసింది. ఎయిర్‌పోర్టు అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను పేల్చివేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ల దాడికి తెగబడుతోంది. గురువారం రాత్రి పాకిస్థాన్ సుమారు 300 నుంచి 400 టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

శుక్రవారం నాడు పాకిస్థాన్, భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పలు క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా ఎస్-400 క్షిపణి వ్యవస్థ, ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించాయి.

మరోవైపు, పాక్ దాడులకు ప్రతిగా భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ప్రతీకార దాడులు నిర్వహించాయి. లాహోర్‌లోని పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *