దామెర, మే 03 (ప్రజాజ్యోతి)::
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో బ్యాంక్ సౌకర్యం లేక పోవటంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ.. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ ను కలిసి బ్యాంక్ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం వినతిపత్రం సమర్పించారు. బ్యాంకింగ్ సదుపాయం లేకపోవడం వల్ల రైతులు, మహిళా సంఘాలు, వృద్ధులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ నాయకులు బ్యాంకు అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ.. దామెర మండలంలో బ్యాంక్ శాఖ లేకపోవడం ప్రజలకు అనేక ఇబ్బందులను కలిగిస్తోంది. లావాదేవీల కోసం వారు ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. దామెర మండలానికి చెందిన బ్యాంక్ వరంగల్ నగరంలో సేవలు అందిస్తుందటంతో ప్రజలు ప్రతి పనికి వరంగల్ వెళ్ళవలసి వస్తుందని వారు తెలిపారు. ముఖ్యంగా పింఛనుదారులు, రైతులు, మహిళా సంఘాలకు ఇది పెద్ద సమస్యగా మారింది. బ్యాంక్ అధికారిక శ్రేణి తక్షణమే స్పందించి బ్యాంక్ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు డా. పెసరు విజయచందర్ రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కి వివరించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కు దీనిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. బ్యాంకు శాఖ కోసం బీజేపీ నాయకుల పోరాటం ఫలిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. త్వరలోనే దామెర మండలం కేంద్రంలో బ్యాంక్ శాఖ ఏర్పాటు జరుగుతుందని, ప్రజలకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి, దామెర మండల అధ్యక్షుడు వేల్పుల రాజ్ కుమార్, బత్తుల సుమంత్ పాల్గొన్నారు.
