మోడీ రాహుల్.. ఒకటే వ్యూహమా ?

V. Sai Krishna Reddy
2 Min Read

దేశమంతా అతి పెద్ద చర్చగా ఇంకా చెప్పాలంటే రచ్చగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 మీద పార్లమెంట్ లో రెండు రోజుల పాటు చర్చ సాగింది. అయితే ఇంతటి కీలకమైన చర్చలో కనిపించని ఇద్దరు దిగ్గజ నేతల గురించి అంతా చర్చిస్తున్నారు. ఆ ఇద్దరే ప్రధాని నరేంద్ర మోడీ. లోక్ సభలో అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ.

ఈ బిల్లు ఏప్రిల్ 2న లోక్ సభలో చర్చకు వచ్చింది. మొదట ఎనిమిది గంటలు అనుకుంటే అది కాస్తా అర్ధరాత్రి దాకా సాగింది. లోక్ సభలో చర్చలో ప్రధాని మోడీ కనిపించలేదు. ఇక కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే ఎంతో మంది నాయకులు మాట్లాడారు కానీ రాహుల్ గాంధీ రాలేదు. ఇక ఆయన సోదరి వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా సభలో లేరు.

ఇక దీనికంటే ముందు లోక్ సభలో వక్ఫ్ బిల్లు మీద చర్చ ఉందని తెలిసి ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పాల్గొని వ్యూహ రచన చేసిన రాహుల్ తీరా సభలో మాత్రం తన వాయిస్ వినిపించలేదు. తన చెల్లెలు వాయిస్ కూడా వినపడలేదు. ఎటూ లోక్ సభలో ఈ బిల్లు ఈజీగా పాస్ అవుతుందని ఆలోచించి ఆయన రాలేదా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కనిపించలేదు. మొత్తం భారమంతా తన మీద వేసుకుని హోం మంత్రి అమిత్ షా విపక్షాలను నిలువరిస్తూ కనిపించారు. లోక్ సభలో బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. అంటే భారీ మెజారిటీతో బిల్లు నెగ్గింది.
ఇక రాజ్యసభలో కూడా చూస్తే సోనియా గాంధీ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. కానీ బిల్లు మీద సోనియా మాట్లాడలేదు ఖర్గే తదితరులు మాట్లాడారు. సోనియా పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడి ఎన్డీయే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారానే కేంద్ర ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే థాయిలాండ్ టూర్ కి వెళ్ళిపోయారు. మరి వక్ఫ్ బిల్లు దేశంలోని ఇరవై కోట్ల మందికి సంబంధించిన అంశం కదా ఎందుకు ఇలా అంటే అధికార విపక్షాల అధినేతల వ్యూహాలు ఇవే అని అంటున్నారు. మాట్లాడటం కాదు మాట్లాడకపోవడమూ ఒక వ్యూహమే అని అంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *