సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళకు భర్త చెన్నయ్య, స్కూల్కు వెళ్లే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ రంజిత తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. అనంతరం తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లలను సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)గా గుర్తించారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..
గురువారం రాత్రి రంజిత తన ముగ్గురు పిల్లలకు పెరుగు అన్నం తినిపించింది. అనంతరం ఆమె కూడా అదే ఆహారాన్ని భుజించింది. భర్త చెన్నయ్యకు మాత్రం పప్పు అన్నం విడిగా పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారు. భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ విధులకు వెళ్లి అర్ధరాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే భార్య తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. నిద్రపోతున్న పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ దారుణానికి పాల్పడిందా? లేదా ఎవరైనా వీరి ఆహారంలో విషం కలిపారా? అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.