ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ

V. Sai Krishna Reddy
1 Min Read

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో తలదాచుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితులను తీసుకువచ్చి విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకరరావు, మరో ముఖ్య నిందితుడు అరువెల్ల శ్రవణ్‌రావులపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్ పోల్) నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది.

వారిద్దరినీ వీలైనంత త్వరగా తీసుకొచ్చే విషయంపై కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు అంశం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కు చేరితే వారిద్దరినీ అమెరికాలో ప్రొవిజినల్ (తాత్కాలిక) అరెస్టు చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశం ఉంది.

అయితే, ప్రొవిజినల్ అరెస్టును వారు అక్కడి న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిందితుల పిటిషన్‌ను అక్కడి న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడి న్యాయస్థానంలో వారికి ఊరట లభించకపోతే మాత్రం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *